గుడ్న్యూస్..వాట్సాప్ గవర్నెన్స్లో మరో 150 అదనపు సేవలు, ఏపీ ప్రభుత్వం ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారి, తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 3 March 2025 7:43 PM IST
గుడ్న్యూస్..వాట్సాప్ గవర్నెన్స్లో మరో 150 అదనపు సేవలు, ఏపీ ప్రభుత్వం ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారి, తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పీపుల్స్ పర్సెప్షన్, ఆర్టీజీఎస్పై సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రగతి గురించి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రజలందరూ వాట్సాప్ గవర్నెన్స్ సులభంగా ఉపయోగించుకునేలా, ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం తమ ఫోనులో వాట్సాప్ ద్వారా తమకు కావాల్సిన సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కల్పిస్తోందన్నారు. దీనిపై ప్రజల్లో ఇంకా కొంత అవగాహన తక్కువగా ఉందని, ప్రజలందరూ సమర్థవంతంగా వాట్సాప్ గవర్నెన్స్ను విరివిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లందరూ ఈ బాధ్యత తీసుకుని తమ జిల్లాలో ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్స్ను పెద్ద ఎత్తున ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాలు, సచివాలయ సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల్లో దీని గురించి ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
వాట్సాప్ ద్వారా అర్జీలు ఇవ్వొచ్చు
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు కేవలం ప్రభుత్వం నుంచి సేవలు పొందడమే కాదని, ఫిర్యాదులు, అర్జీలు కూడా పెట్టుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సదుపాయం గురించి ప్రజలకు వివరించాలన్నారు. నిరక్షరాస్యులు కేవలం తమ ఫిర్యాదును వాయిస్ ద్వారా కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలిపే సదుపాయాన్ని త్వరలో కల్పించబోతున్నామని తెలిపారు. పౌరుల్లో డిజిటల్ అక్షరాస్యత పెరిగితే వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగిత కూడా పెరుగుతుందన్నారు. వాట్సాప్లో క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకునే సదుపాయం కల్పించే చర్యలు కూడా వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు.
నెలాఖరుకు 350 సేవలు
వాట్సాప్ ద్వారా ప్రస్తుతం 200 రకాలైన సేవలు ప్రజలకు అందిస్తున్నామని ఐటీ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెలాఖరులోపు మరో 150 అదనపు సేవలు కల్పిస్తామని తద్వారా వాట్సాప్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు 350కి చేరుతాయన్నారు. తదుపరి దశలో మొత్తం 500 సేవలు కల్పిస్తామన్నారు. మే నెలలో మొదటి దశ డేటా లేక్ ఏర్పాటు పూర్తి చేస్తామని వివరించారు. అలాగే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సును పెద్ద ఎత్తున ఉపయోగించుకుని ఒన్ స్టేట్ ఒన్ యాప్ విధానంలో ప్రజలకు అన్ని సేవలు కేవలం ఒక ప్లాట్ఫాంలో లభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.