Andhrapradesh: వారందరికీ పింఛన్లు.. మంత్రి డోలా కీలక ప్రకటన

అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు.

By అంజి
Published on : 26 Sept 2024 6:51 AM IST

Andhra Pradesh, Minister Dola Bala Veeranjaneya Swamy, Pensions, APnews

Andhrapradesh: వారందరికీ పింఛన్లు.. మంత్రి డోలా కీలక ప్రకటన

కర్నూలు: అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. బుధవారం కొండపిలో జరిగిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. అక్టోబరు 1 నుంచి గ్రామసభలు నిర్వహించి పింఛన్‌ లబ్ధిదారులను గుర్తించి ఆమోదించే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.

మంత్రి ప్రసంగిస్తూ తమ పాలన అమల్లోకి వచ్చిన వంద రోజుల్లోనే జిల్లాలో మూడు సాంఘిక సంక్షేమ హాస్టల్‌ భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అదనంగా కొండపిలోని రెసిడెన్షియల్ పాఠశాలకు రూ.13 లక్షలు, సాంఘిక సంక్షేమ హాస్టల్‌కు రూ.14 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొత్తం రూ.143 కోట్లతో సిమెంటు రోడ్లు, సైడ్ కాల్వల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. రూ.15 కోట్లతో ఐదు విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు.

జిల్లా కలెక్టర్ థమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతకు మేలు చేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం హౌసింగ్ డే జరుపుకుంటున్నామని, మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు త్వరితగతిన ఇళ్లను నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిణి ఉషారాణి, వ్యవసాయ సంయుక్త సంచాలకులు శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story