అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడి ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు నిధుల్ని విడుదల చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి రూ.600 కోట్ల నిధులు విడుదల చేసినట్టు విద్యాశాఖ కార్యదర్శి కోన శ్రీధర్ ప్రకటించారు. . 2024 - 25 ఏడాదికి గాను అదనపు మొత్తం విడుదల చేశామని చెప్పారు. త్వరలో మరో రూ.400 కోట్లు రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ ఈ పథకానికి మొత్తంగా రూ.788 కోట్లు విడుదల అయినట్టు పేర్కొన్నారు.
పెండింగ్ బకాయిలు సైతం త్వరలోనే చెల్లిస్తామని అయితే ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడితే మాత్రం కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యాసంస్థలకు స్పష్టం చేశారు. విద్యార్థుల్ని క్లాసులకు హాజరుకానివ్వకుండా, హాల్ టికెట్లు నిలిపివేయడం, పరీక్షలు రాయనీయకుండా అడ్డుపడడం వంటి చర్యలకు దిగితే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఫీజురీయింబర్స్మెంట్ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీ అకౌంట్లకు జమ చేస్తుంది.