ఏపీకి ఏడు కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్నారు
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Aug 2024 10:45 AM IST
ఏపీకి ఏడు కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిశారు. శనివారం సిఎం పౌర విమానయాన మంత్రిత్వ శాఖను సందర్శించారు. అక్కడ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో విమానాశ్రయాల నెట్వర్క్ను ప్రస్తుతం ఉన్న 7 నుండి 14కి విస్తరించనున్నట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాజమండ్రి, విజయవాడ, కడపలలో విమానాశ్రయాల అభివృద్ధి పనులు చేయాలని అనుకుంటూ ఉన్నామని.. అలాగే టెర్మినల్ సామర్థ్యాన్ని పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి కోరారని తెలిపారు. భూమి ఇస్తే కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తరపున సహకారం అందిస్తానని కేంద్ర మంత్రి చెప్పారు. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్లలో కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు. పుట్టపర్తి విమానాశ్రయాన్ని ప్రభుత్వ సంస్థగా మార్చే యోచనపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీని లాజిస్టిక్ హబ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని.. ఈ విషయంలో కొత్త విమానాశ్రయాలు కీలక పాత్ర పోషించనున్నాయన్నారు.