AndhraPradesh: పింఛన్ల పెంపుపై అధికారుల కసరత్తు.. ఒక్కొక్కరికి రూ.7 వేలు

రూ.4 వేల పింఛను పెంపుతో పాటు దివ్యాంగులకు రూ.6 వేల పింఛనును ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాయి.

By అంజి  Published on  11 Jun 2024 1:19 AM GMT
Andhra Pradesh, Andhra Pradesh authorities, social security pensions, APNews

AndhraPradesh: పింఛన్ల పెంపుపై అధికారుల కసరత్తు.. ఒక్కొక్కరికి రూ.7 వేలు  

పింఛన్ల పెంపుపై ఆంధ్రప్రదేశ్‌ అధికారులు కసరత్తు ప్రారంభించారు. రూ.4 వేల పింఛను పెంపుతో పాటు దివ్యాంగులకు రూ.6 వేల పింఛనును ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు తమ మేనిఫెస్టోలో ప్రకటించారు. పింఛను జులై 1వ తేదీన అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులుండగా.. వీరి పింఛను కోసం నెలకు రూ.1,939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది.

ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.7 వేలు (జులై 1న ఇచ్చే పింఛను రూ.4 వేలు+ ఏప్రిల్‌ నుంచి రూ.వెయ్యి చొప్పున రూ.3 వేలు) చొప్పున, దివ్యాంగులకు రూ.6 వేల పింఛను ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు జులై 1న పింఛను పంపిణీ చేయడానికి రూ.4,400 కోట్లు అవుతుందని అధికారుల ప్రాథమికంగా అంచనా. ఆగస్టు నుంచి అయితే నెలకు రూ.2,800 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది దివ్యాంగ పింఛనుదారులు ఉన్నారు.

వీరు ప్రస్తుతం రూ.3 వేలు పింఛను తీసుకుంటుండగా.. వీరి పింఛనును రూ.6 వేలకు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవి కాకుండా పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేల పింఛను అందించేందుకు సిద్ధమవుతున్నారు. కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛను అందించేందుకు అధికారులు అర్హుల వివరాలు సేకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు 50 ఏళ్లకే పింఛనును అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు.

Next Story