ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షా పత్రం లీకేజి అంశంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం నిర్ణీత సమయానికి అరగంట ముందే లీక్ అయింది. దీనిపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. పేపర్ లీక్ పై విచారణ నిర్వహించాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షను రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఛైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందుగానే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. అరగంట ముందు సీడీ ద్వారా ప్రశ్నపత్రం రిలీజ్ చేశారు. అది ఎలా బయటకు వెళ్లిందో తెలియదని అధికారులు చెబుతున్నారు.