ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించవలసిందిగా కేంద్ర ఆర్ధికమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (SASCI-Special Assistance to States for Capital Investment ) పథకం కింద రూ. 2,010 కోట్లు లభించాయని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మూలధన ప్రాజెక్టుల కోసం అదనంగా రూ. 5,000 కోట్లు కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ (SNA Sparsh) ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం రూ. 250 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై తగు ఉత్తర్వులు ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి...ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం పొందగలదని తెలిపారు. దీని విధివిధానాలు రూపొందించి త్వరగా ఈ పథకాన్ని అమల్లో తేవాలని ముఖ్యమంత్రి కోరారు.