ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. కంచికచర్ల మండలం కేసర టోల్గేట్ వద్ద బస్సు వెనక ఇంజిన్లో పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బస్సు నుంచి దిగిపోయారు. ఆ తర్వాత మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఇదిలా ఉంటే.. నిన్న తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. తిరుపతి నుంచి వినుకొండ వెళ్తున్న బస్సు విన్నమాల వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై బస్సులోంచి దిగడంతో ఘోర ప్రమాదం తప్పింది. టికెట్ తీసుకునేందుకు లేచినప్పుడు మంటను గుర్తించిన వెంటనే ఇతర ప్రయాణికులను అలర్ట్ చేసినట్టు వెనుక సీటులో ఉన్న ప్రయాణికుడు తెలిపారు. ఘటనలో సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు.