అనంతపురంలో విషాదం.. ఇద్దరు చిన్నారుల గల్లంతు
By అంజి Published on 21 Jan 2020 8:29 AM IST
అనంతపురం: జిల్లాలోని కదిరి మండలం చెర్లోపల్లి వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. చెర్లోపల్లి రిజార్వాయర్లో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వేళ్తే.. ఆదివారం నాడు నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన హైదర్వలి కుటుంబం చెర్లోపల్లి రిజర్వాయర్ వద్దకు విహారయాత్రకు వెళ్లింది. హైదర్వలి కుటుంబం కదిరి రూరల్ పరిధిలోని కమ్మరవాండ్లపల్లిలో నివాసం ఉంటున్నారు. భార్య, కుమార్తెలు నౌహిరా (9), నాజీరా (11)లతో హైదర్వలి రిజర్వాయర్ వద్దకు వచ్చి సంతోషంగా గడిపారు. అక్కడే భోజనం చేశారు. అనంతరం అక్కా చెల్లెళ్లు ఇద్దరు రిజర్వాయర్లోకి దిగారు. దీంతో అక్కడే ఒక గుంత ఉండడంతో ఇద్దరు అదుపు తప్పి నీటిలో పడిపోయారు. అక్కడే ఉన్న స్థానికులు కొంత మంది చిన్నారులను రక్షించడానికి ప్రయత్నించారు. కాగా ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొక చిన్నారి కోసం స్థానికులు గాలిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు కదిరి డీఎస్పీ షేక్లాల్ అహ్మద్, రూరల్ సీఐ నిరంజన్ సంఘటానా స్థలానికి చేరుకున్నారు. సిబ్బందితో నౌహీరా కోసం గాలిస్తున్నామని తెలిపారు.