ఆ పదాన్ని బ్యాన్ చేయాలని కోరుతున్న ఆనంద్ మహీంద్ర

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 May 2020 7:33 AM GMT
ఆ పదాన్ని బ్యాన్ చేయాలని కోరుతున్న ఆనంద్ మహీంద్ర

ఆనంద్ మహీంద్ర.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటుంటాడు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉండడమే కాకుండా.. పలు అంశాల గురించి ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్ని ఫన్నీ వీడియోలను కూడా ఆయన షేర్ చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల కిందట వర్క్ ఫ్రమ్ హోమ్ వలన ఉన్న ప్లస్-మైనస్ లను తెలియజేశారు ఆనంద్ మహీంద్ర. తాజాగా ఓ పదాన్ని బ్యాన్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారు ఆయన.

ఇంతకూ ఆ పదం ఏమిటనే కదా 'Webinars'. సాధారణంగా ఆఫీసులు ఉంటే అందరినీ ఒక గదిలోకి పిలిచి.. సెమినార్ లు ఇస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా చెప్పాలి అని అనుకున్నా కూడా ఈ సెమినార్ ల ద్వారా ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. కొన్ని మిలియన్ల మంది సెమినార్ లకు దూరమైపోయారు. ఇప్పుడు ఈ సెమినార్ ల స్థానంలో ఇంటర్నెట్ లో వీడియో కాలింగ్ సదుపాయంతో 'వెబినార్' లను తీసుకుని వచ్చారు. ఇంటర్నెట్ లో ఇచ్చే సెమినార్ లను వెబినార్ అంటూ పిలుస్తూ ఉన్నారు.

తనకు మరో 'వెబినార్' ఇన్విటేషన్ వచ్చిందని.. ఈ పదాన్ని డిక్షనరీ నుండి బ్యాన్ చేస్తే చాలా మంచిదని ఆయన అన్నారు.



ఆయన పెట్టిన పోస్టును చాలా మంది మెచ్చుకున్నారు. 3000కు పైగా లైక్ లు వచ్చాయి. ఈ పదాన్ని బ్యాన్ చేస్తే మంచిది కదా సార్ అంటూ పలువురు తమ అభిప్రాయాలను తెలిపారు.

ఇక లాక్ డౌన్ ను పొడిగిస్తే మాత్రం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అన్నది సర్వ నాశనం అవుతుందని చెబుతున్నారు ఆనంద్ మహీంద్రా. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అన్నది పాతాళంలోకి వెళ్లిపోయిందని.. ఇంకా లాక్ డౌన్ ను పొడిగిస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఇటీవల ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో లాక్ డౌన్ 4.0 ప్రస్తుతం అమలు అవుతోంది. మే 31 నాటికి లాక్ డౌన్ అన్నది ముగియనుంది. మరోసారి దేశ ప్రధాని లాక్ డౌన్ ను కొనసాగిస్తామని పిలుపును ఇస్తారో.. లేక.. అన్ని సడలింపులు ఎత్తివేస్తూ ప్రకటనను విడుదల చేస్తారో చూడాలి.

Next Story