'ఆచార్య' కథ ఆరోపణలపై స్పష్టతనిచ్చిన మూవీ టీం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2020 11:42 AM GMT
ఆచార్య కథ ఆరోపణలపై స్పష్టతనిచ్చిన మూవీ టీం

మెగాస్టార్‌ చిరంజీవి హీరో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగాస్టార్‌ పుట్టిన రోజు ఆగస్టు 22న ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ ను విడుదల చేశారు. అయితే.. ఈ చిత్ర కథ తమదేనంటూ కన్నెగంటి అనిల్‌ కృష్ణ, రాజేశ్‌ మండూరి అనే ఇద్దరు రచయితలు వేర్వేరుగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ ఒక లెటర్‌ రిలీజ్ చేసింది. ఈ సినిమా కథ ఎవరి నుంచి కాపీ కొట్టింది కాదని, కొరటాల శివ ఒరిజినల్‌ కథ అని ఆ ప్రకటనలో పేర్కొంది. కాపీ కొట్టారంటూ వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అవన్నీ ఒట్టిమాటలని కొట్టేసింది.

" ఇటీవల చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాం. దీనికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ఇద్దరు రచయితలు ఈ సినిమా స్టోరీకి సంబంధించి అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి మేం 'ఆచార్య' సినిమా కథను ఎంతో గోప్యంగా ఉంచాం. యూనిట్‌లో కూడా ఈ చిత్ర కథ తెలిసినవాళ్లు అతి కొద్దిమంది మాత్రమే. ఈ నేపథ్యంలో మేం విడుదల చేసిన మోషన్ పోస్టర్ ను చూసి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఇది ఒక ఒరిజనల్ కథ. కొరటాల శివ వంటి ప్రముఖ ఫిలింమేకర్ ను అప్రదిష్ఠ పాల్జేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ సినిమాకు సంబంధించి వచ్చే ఏ ఆరోపణ అయినా పూర్తిగా నిరాధారం, అవన్నీ కూడా కల్పిత కథల ఆధారంగా పుట్టుకొచ్చినవే అయ్యుంటాయి" అంటూ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.



Next Story