నాంపల్లి ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత..
By అంజి Published on 3 March 2020 8:50 AM GMTముఖ్యాంశాలు
- ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు
- ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
- జీవో నెంబర్ 35ని రద్దు చేయాలని డిమాండ్
హైదరాబాద్: ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. ఎయిడెడ్ కాలేజీల భూమునులను కబ్జాదారుల నుండి కాపాడాలని, జీవో నెంబర్ 35ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దోస్త్ డిగ్రీ అడ్మిషన్లలో ప్రైవేట్ ఎయిడెడ్ని తొలగించి ఎయిడెడ్ని కొనసాగించాలని విద్యార్థి నాయకులు అన్నారు.
ఎయిడెడ్ కాలేజీల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఎయిడెడ్ కాలేజీలో అధ్యాపకులను ప్రభుత్వ కాలేజీలకు బదిలీ చేయడాన్ని ఆపాలని ఏబీవీపీ నేతలు అన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు ఇంటర్బోర్డు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. పలువురు ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.