93కు చేరినా కరోనా కేసులు.. రెండో దశలో వైరస్..
By అంజి Published on 15 March 2020 6:01 AM GMTఢిల్లీ: భారత్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర హోంశాఖ వైబ్సైట్ ప్రకారం ఇప్పటి వరకు 93 పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 17 మంది విదేశీయులు ఉన్నారు. కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. తొమ్మిది కోలుకున్నారు. భారత్లో ఈ వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉండడంతో.. దీనిని కేంద్ర ప్రభత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. వైరస్ కట్టడిపై చేపట్టాల్సిన అన్ని ప్రత్యామ్నాయాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మాస్కులు, శానిటైజర్లు నిత్యావసర వస్తువులుగా ప్రకటించి వాటీ తయారీని పెంచాలని ఆయా సంస్థలకు సూచించింది.
Also Read: కరోనా ఇక జాతీయ విపత్తు..
కరోనా వైరస్ వ్యాప్తిపై తప్పుడు ప్రచారం చేస్తే సంవత్సరం పాటు జైలు శిక్ష తప్పదని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరిక చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేయొద్దన్నారు. సోషల్ మీడియాలో కరోనా వైరస్ వ్యాప్తిపై తప్పుడు ప్రచారం చేస్తూ సమాజంలో ఒక రకమైన భయాందోళన సృష్టిస్తున్నారని, ఇది ఏ మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై ఎన్డీఎమ్ఏ యాక్ట్ సెక్షన్ 54 కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ సెక్షన్ కింద సంవత్సరం పాటు జైలు శిక్ష, జరిమానా ఉంటుందని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చేయడం వల్ల ప్రజలు భీతి చెందే అవకాశాలున్నాయని తెలిపారు.
Also Read: ‘కరోనా కేస్షీట్’ విషయం మాత్రం తేలడం లేదు..
గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ తెగ ప్రచారం జరుగుతోంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. దీంతో ఆ వార్తలను చూస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలో కరోనా కట్టడికి కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 31 వరకు సినిమా హాళ్లు, స్కూళ్లు, పార్కులు మూసివేయనున్నారు.