ఏపీలో కొత్తగా మరో 67 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 4 May 2020 1:41 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిసి రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1650కి చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి భారీన పడి 33 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలులో 25 కేసులు నమోదు కాగా.. గుంటూరులో 19, కృష్ణలో 12, కడపలో 4, విశాఖ పట్నంలో 6, చిత్తూరులో 1 కేసు నమోదు అయ్యాయి.
ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల్లో 524 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1093 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 491 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక గుంటూరులో 338, కృష్ణలో 278 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు.