జూలై 31 నాటికి ఢిల్లీలో 5.5లక్షల కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2020 12:10 PM GMT
జూలై 31 నాటికి ఢిల్లీలో 5.5లక్షల కేసులు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత ఆందోళనకరంగా ఉంది. దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో ఢిల్లీ 3వ స్థానంలో ఉంది. ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి లేదన్నారు. అయితే.. 50శాతం కేసులకు మూలం మాత్రం తెలియని చెప్పారు. జూలై చివరి నాటికి దాదాపు 5.5లక్షల పాజిటివ్‌ కేసులు ఢిల్లీలో నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు.

ఆ సమయానికి ఆస్పత్రుల్లో 80వేల పడకలు అవసరమవుతాయని, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల తీరును పరిగణలోకి తీసుకొని జూన్‌ చివరకు లక్షకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. 12 నుంచి 13 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నాయని తెలిపారు. ఢిల్లీలో కరోనా వైరస్‌ కమ్యూనిటీ స్ర్పెడ్‌ లేదని సిసోడియా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో భేటీ అయిన అనంతరం ఈ విషయం చెప్పారు. కమ్యూనిటీ స్ర్పెడ్‌ ఇంకా మొదలు కాలేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారని ఆయన అన్నారు. పాజిటివ్‌ వచ్చిన కేసుల్లో దాదాపు 50 శాతం సోర్స్‌ తెలియదని, దీనికి సంబంధించి కేంద్రం స్పష్టత ఇవ్వాలని హెల్త్‌ మినిస్టర్‌‌ సత్యేంద్ర జైన్‌ అన్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌‌ కూడా కమ్యూనిటీ స్ప్రెడ్‌ స్టార్ట్‌ అయిందని అన్నారు.

కరోనా వైరస్‌ లక్షణాలతో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ మీటింగ్‌ లో పాల్గొనలేదు. కేజ్రీవాల్ కు ఈరోజు కరోనా టెస్ట్ లు జరిగాయి. రిపోర్టులు రావాల్సి ఉంది. ఇక ఇప్పటి వరకు 27వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Next Story