వారు జ‌యించారు.. ఆ జిల్లాలో ఒకేసారి 24మంది డిశ్చార్చ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 April 2020 12:53 PM GMT
వారు జ‌యించారు.. ఆ జిల్లాలో ఒకేసారి 24మంది డిశ్చార్చ్

కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన 24 మందిని విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుండి ఈ సాయంత్రం కలెక్టర్ జి. వీరపాండియన్ డిచ్చార్జ్ చేశారు. దీంతో ఈ జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కూ 31 మంది కరోనాను జ‌యించారు. ఈ సంద‌ర్బంగా కలెక్టర్ జి. వీరపాండియన్ మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మ‌హమ్మారి కోరల నుండి ఆరోగ్యంగా బయటపడి ఒకే రోజు 24 మంది డిశ్చార్చ్ కావడం బిగ్ రిలీఫ్ అని.. దీని ద్వారా జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి కరోనాను జయించవచ్చనే మనో ధైర్యం కలిగిందని అన్నారు.

ఇక‌ ఈ సాయంత్రం డిశ్చార్చ్ అయిన 24 మందిలో కర్నూలు నగరం నుండి ఏడుగురు, నంద్యాల పట్టణం నుండి 7గురు, పాణ్యం నుండి ఇద్ద‌రు, సిరివేళ్ళ నుండి ఇద్ద‌రు, గడివేముల నుండి ఒక్కరు, రుద్రవరం నుండి ఒక్కరు, నందికొట్కూరు నుండి ఇద్దరు, ఆత్మకూరు నుండి ఒక్కరు, డోన్ నుండి ఒక్కరు ఉన్నారు.

ఈ సందంర్బంగా స్టేట్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆస్పత్రికి వెళ్లి.. కరోనా విజేతలను, డాక్టర్లు, సిబ్బందిని అభినందించి.. డిశ్చార్చ్ ఆయిన 24 మందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్ర‌క‌టించిన‌ట్లుగా ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదు, ఫ్రూట్స్ కిట్స్ ను అందించి.. ప్రత్యేక వాహనాల్లో వారి వారి ఇళ్లకు పంపారు.

డిశ్చార్జ్ అయిన వారంతా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి కరోనా బారిన పడ్డ‌వారే. వీరిని ఈ నెల 6న క్వారంటైన్ చేశారు. మెరుగైన ప్రభుత్వ వైద్య సదుపాయాలతో.. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం 2 సార్లు రిపీట్ టెస్ట్ లను చేయించుకుని నెగటివ్ ఫలితం రావడంతో ఆ 24మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంద‌ర్బంగా వారు ప్ర‌భుత్వ యంత్రాంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Next Story