భారత్-పాకిస్థాన్ సరిహద్దులో 20 అడుగుల సొరంగ మార్గం

By సుభాష్  Published on  29 Aug 2020 11:42 AM GMT
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో 20 అడుగుల సొరంగ మార్గం

జమ్మూ: జమ్మూ కాశ్మీర్ లోని భారత్-పాకిస్థాన్ ఇంటర్నేషనల్ బోర్డర్ లో ఏర్పాటు చేసిన ఫెన్స్ కింద సొరంగ మార్గం ఉండడాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుర్తించింది. ఆ ప్రాంతంలో ఇంకా ఏమైనా అలాంటి సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారేమోనని పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ను చేపట్టారు. పాకిస్థాన్ తీవ్రవాదులను భారత్ లోకి తరలించడానికి, డ్రగ్స్, ఆయుధాలను భారత్ లోకి పంపడానికి ఈ సొరంగ మార్గాలను వాడేందుకే దీనిని ఏర్పాటు చేస్తోందని భావిస్తూ ఉన్నారు.

బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ ఆస్తానా సరిహద్దు కమాండర్లకు ఈ సొరంగ మార్గాలను మూసి వేయాలని సూచించారు. భారత్ లోని సాంబా సెక్టర్ వద్ద బిఎస్ఎఫ్ పాట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఈ టన్నెల్ ను గుర్తించారు. అది కూడా భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఫెన్స్ కింద ఉండడం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. ఆ సొరంగాన్ని పరిశీలించగా.. ప్లాస్టిక్ ఇసుక బ్యాగులు ఉండడాన్ని గుర్తించారు.. వాటి మీద పాకిస్థానీ మార్కింగ్స్ ఉన్నాయని అధికారులు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.

ఇటీవలి కాలంలో కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో భూమి కుంగిపోవడాన్ని సైనికులు గమనించారు. కానీ ఈ మధ్య ఆ ప్రాంతంలో సొరంగం ఏమైనా ఉందన్న అనుమానాలు రావడంతో భారత సైన్యం ఆ ప్రాంతంపై నిఘా ఉంచింది. తీరా చూడగా అక్కడ ఒక సొరంగాన్ని గుర్తించారు. ఇంకా ఈ సొరంగాన్ని పూర్తిగా నిర్మించలేదని భావిస్తూ ఉన్నారు. దాదాపు 20 మీటర్లు ఈ సొరంగం ఉందని గుర్తించారు. 8-10 దాకా ఇసుక బ్యాగులు ఉండడాన్ని గుర్తించారు. దాని మీద కరాచీ, షకార్గర్ఘ్ ఉండడాన్ని గుర్తించారు. బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్(జమ్మూ) ఎన్.ఎస్.జమ్వాల్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

పాకిస్థాన్ కు చెందిన బోర్డర్ పోస్టు 'గుల్జార్' సొరంగం ఉన్న ప్రాంతానికి 700 మీటర్ల దూరంలో ఉంది. ఈ సొరంగం బయట పడడంతో భారత ఆర్మీ మరింత అప్రమత్తమైంది. మెగా యాంటీ-టన్నెల్ డ్రైవ్ ను రక్షణ దళాలు మొదలుపెట్టాయి.

Next Story