హైదరాబాద్: టెన్త్ పరీక్షలు వాయిదా: తెలంగాణ ప్రభుత్వం
By సుభాష్ Published on 6 Jun 2020 9:17 PM IST
కరోనా కారణంగా తెలంగాణలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, జీహెచ్ఎంసీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నందున రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతించాలని, అందులో పాసైన వారిని కూడా రెగ్యులర్గా పాసైనట్లు గుర్తించాలని ప్రభుత్వానికి సూచించింది. కోర్టు ఆదేశంపై మరో సారి చర్చించిన ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
కాగా, కరోనా నేపథ్యంలో పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా కారణంతో ఏ విద్యార్థి అయిన మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీలో కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న కారణంగా విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని, పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బాలకృష్ణ, సాయిమణి, వరుణ్లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ సందర్భంగా తుది తీర్పును వెలువరించింది. అయితే జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మినహా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపినా.. ప్రభుత్వం మొత్తానికి వాయిదా వేసేసింది.