'జూమ్‌' యాప్‌ వాడొద్దని హెచ్చరించిన కేంద్రం

By సుభాష్  Published on  17 April 2020 3:03 AM GMT
జూమ్‌ యాప్‌ వాడొద్దని హెచ్చరించిన కేంద్రం

కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగస్తులు వర్క్‌ ఫ్రం హోమ్‌ నిర్వహిస్తున్నారు. అయితే జూమ్ యాప్ వినియోగ‌దారుల‌కు కేంద్రం ఓ షాకింగ్ వార్త చెప్పింది. ఈ యాప్ అంత సురక్షితమైనది కాదని హోం మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీచేసింది. సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ సూచనల మేరకు మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. పలు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఇక తరగతులకు సంబంధించి కళాశాలలు వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం 'జూమ్‌'యాప్‌ ను ఉపయోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జూమ్‌ యాప్‌ అంత సురక్షితం కాదని, ఈ యాప్‌ను వాడవద్దని కేంద్ర హోం మంత్రిత్వశాఖ హెచ్చరించింది.

ఈ యాప్‌ ద్వారా సులభంగా హ్యాక్‌ చేయవచ్చని, రహస్య డేటాను తస్కరించే అవకాశం ఉందని తెలిపింది. దీనిని వాడేటప్పుడు హ్యాకర్స్‌ నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అందులో ఫీచర్స్‌ ఎలా ఉపయోగించుకోవాలి అనేదాని గురించి సూచిస్తూ ఒక డాక్యుమెంట్‌ కూడా కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఈ జూమ్‌ యాప్‌లో భద్రతపరమైన అనేక లోపాలున్నాయని తెలిపింది. ఈ యాప్‌ సైబర్‌ నేరగాళ్లకు ఉపయోగకరంగా ఉందని, మీటింగ్‌ జరుగుతున్న సమయంలో మధ్య మధ్యలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అందులో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉందని సూచించింది. కాన్ఫరెన్స్‌ నిర్వహించేటప్పుడు వెబ్‌సైట్‌లోని యూజర్‌ ఖాతాలోకి లాగిన్‌ కావడం లేదా పీసీ, లాప్‌టాప్‌, ఫోన్‌లలో ఇన్‌స్టాల్‌ చేసి అప్లికేషన్‌లో చాలా రకాలుగా సెట్టింగులు చేయవచ్చని పేర్కొంది.

Next Story