చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు వైఎస్ఆర్ సీపీ స్కెచ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 10:07 AM GMT
చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు వైఎస్ఆర్ సీపీ స్కెచ్..!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లా చిత్తూరులోనే చెక్ పెడుతోంది వైసీపీ. ఒకవైపు చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. జిల్లా మీద పట్టుకోసం ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబుకు దగ్గరగా వుండే నేతలకు గాలమేస్తున్నారు మిగతా వైసీపీ నేతలు. చిరకాలంగా చంద్రబాబు, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మధ్య రాజకీయ వైరం వుండగా.. ప్రస్తుతం వీరిద్దరి మధ్య శతృత్వం తారాస్థాయికి చేరిందని చెప్పుకుంటున్నారు చిత్తూరు జిల్లా వాసులు.

చిత్తూరులో ఇద్దరు నేతల మధ్య ఫైట్‌ నడుస్తుంటే…మరోవైపు వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పదును పెడుతోంది. జిల్లాలో టీడీపీ పునాదులపై దృష్టిపెట్టింది. కీలక నేతలకు వల వేసే పనిలో పడింది. వైసీపీ నేతల టచ్‌లోకి ఆ నేత వెళ్లారని ప్రచారం జరుగుతోంది.

టీడీపీ అధినేత సొంత జిల్లా చిత్తూరు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాకు వచ్చిన ఆయన మూడు రోజుల పాటు సమీక్షలు నిర్వహించారు. కేడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంటే..మరోవైపు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ ఇంట్లో వైసీపీ ఎమ్మెల్యేల హడావుడి కొనసాగింది. డీకే సత్యప్రభ దగ్గరి బంధువైన చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైసీపీ నేతలు డీకే సత్యప్రభను కలిశారు.

తమిళనాడులోని శ్రీపురం స్వర్ణ దేవాలయం పీఠాధిపతి శ్రీ నారాయణి అమ్మన్‌ డీకే సత్యప్రభ ఇంట్లో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామి దర్శనం చేసుకునేందుకు వచ్చిన వైసీపీ నేతలు ఆమెతో రాజకీయ మంతనాలు కూడా చేశారని విశ్వసనీయ సమాచారం. గతంలో చిత్తూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న డీకే సత్యప్రభను గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీ సీటుకు మార్చారు. దీంతో ఆమె అప్పటినుంచి పార్టీ మీద అలకవహించారని సమాచారం.

చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి స్వతంత్రంగానే ఉన్నారు. టీడీపీలోకి ఆయన జంప్‌ అయిన తర్వాత ఈయన కాంగ్రెస్‌లోకి..అక్కడి నుంచి వైసీపీకి రావాల్సి వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా జిల్లాలో తన రాజకీయ పెత్తనాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన పెద్దిరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లోనూ అంతా తానై వ్యవహరించారు. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో కుప్పం మినహా 13 చోట్ల వైసీపీ గెలిపించడంలో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారు. ప్రభుత్వంలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి హవాతో చంద్రబాబు మళ్లీ ఆయన్ని టార్గెట్‌ చేశారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది.

ఒకవైపు టిడిపి నుంచి జంప్ జిలానీల సంఖ్య పెరిగి పోవడం.. వచ్చే ఎన్నికల నాటికి టిడిపి అసలుంటుందా అన్న స్థాయిలో బిజెపి, వైసీపీ యత్నాలు ముమ్మరం చేయడంతో జిల్లాలో పెద్దిరెడ్డి, చంద్రబాబు ఆధిపత్య పోరు మరోసారి వార్తలకెక్కింది. పరిస్థితిని అడ్వాంటేజ్‌గా మార్చుకునేందుకు పెద్దిరెడ్డి తన అధికార బలాన్ని కూడా వాడుతున్నారు. సో.. ఈసారి పోరు ఆసక్తికరంగా మారుతోంది.

Next Story