నేడు వైఎస్సార్ జలకళ పథకానికి శ్రీకారం
By సుభాష్
ఏపీలో సీఎం జగన్ పాలనపరంగా దూసుకుపోతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్నోపథకాలు ప్రవేశపెడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. తాజాగా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. నవరత్నాల్లో భాగంగా రైతులకు ఉచిత బోర్వెల్పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం 'వైఎస్సార్ జలకళ' పథకాన్ని సోమవారం సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలనుకున్న రైతన్నలు తమ పరిధిలోని వాలంటీర్ల ద్వారా, పట్టాపాస్బుక్, ఆధార్ కార్డు కాపీలతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
బోర్ డ్రిల్లింగ్ వేసే ముందు రైతు పొలంలో హైడ్రో జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే బోర్లు వేస్తారున. ఈ పథకంలో లబ్ది పొందాలనుకునే రైతులకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల్లోపు భూమి ఉండాలి. ఒక వేళ రైతులకు అంత భూమి లేకపోతే పక్కనే ఉన్నవారితో కలిసి బోరు వేయించుకునే అవకాశం కూడా జగన్ సర్కార్ కల్పించింది. అంతేకాకుండా ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం ఉండకూడదు. దీనికి సంబంధించిన సమాచారం సదరు రైతుకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు.