నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Jun 2020 7:14 PM IST![నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/06/YCP-MP-Letter-to-Loksabha-Speaker.jpg)
పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జిల్లాలోని నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు ఏకంగా తనకు ప్రాణహాని ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తనను కొంతమంది చంపుతామని బెదిరిస్తున్నారని.. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు రక్షణ కల్పించాలని ఎంపీ లేఖలో కోరారు.
ఆయన ఇంకా ఆ లేఖలో ఏం రాశారంటే... తిరుమల శ్రీవారి భూముల అమ్మకం అంశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలవడానికి ప్రయత్నించాను. అప్పట్నుంచి నా నియోజకవర్గంలో కొంతమంది అలజడి సృష్టిస్తున్నారు. కోట్లాది భక్తుల మనోభావాలను కాపాడే ప్రయత్నం చేశాను. స్వామి వారి భక్తుడిగా తన లాంటివారు కోరుకున్న విషయాలను మీడియా ద్వారా చెప్పానంతే. ఇలా బహిరంగంగా చెప్పినందుకు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
అలాగే.. ఇసుక వ్యవహారంలోనూ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపానని.. సామాన్యులకు న్యాయం చేయాలని కోరితే ఎమ్మెల్యేలతో విమర్శలు చేయిస్తున్నారని.. నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని బెదిరిస్తున్నారని.. స్థానిక పోలీసులకు నా వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు చేసినా... పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రఘు రామకృష్ణ రాజు లేఖలో పేర్కొన్నారు.