ఆ పానీపూరీ అబ్బాయి మళ్లీ ఇరగదీశాడు..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Dec 2019 3:00 PM GMTదక్షిణాఫ్రికాతో జరిగిన అండర్-19 రెండో వన్డేలో భారత యువ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. యశస్వి జైశ్వాల్ ఆల్రౌండ్ ప్రతిభ జట్టుకు సునాయస విజయాన్ని అందించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 29.5 ఓవర్లలోనే 119 పరుగులకు ఆలౌటైంది. యశస్వి 4 వికెట్లు తీయగా.. ఆకాశ్ సింగ్, అంకోలేకర్, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.
అనంతరం 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 2 వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే ఛేదించింది. బౌలింగ్లో అదరగొట్టిన యశస్వి అజేయ అర్థసెంచరీతో రాణించాడు. 56 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. జురెల్ 26 పరుగులు చేయగా, ప్రియం గార్గ్ డకౌటయ్యాడు.
ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీ చేయడంతో పాటు 4 వికెట్లు పడగొట్టిన యశస్వీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. దీంతో తన 18వ పుట్టినరోజును తీపిగుర్తుగా మలుచుకున్నాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 2-0తో భారత్ సొంతం చేసుకుంది. మూడో వన్డే సోమవారం జరుగుతుంది.
ఇదిలావుంటే.. ఇటీవల జరిగిన ఐపీఎల్-2020 వేలంలో యశస్వి జైశ్వాల్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.2.4 కోట్లకు సొంతం చేసుకుంది. కొద్ది కాలం క్రితం వరకూ రోడ్డుపై పానీపూరీలు అమ్మిన యశస్వికి ఇంత భారీ మొత్తం లభించడం విశేషం. అందుకే కష్టే పలి అన్నారు పెద్దలు.