ఆ పానీపూరీ అబ్బాయి మ‌ళ్లీ ఇర‌గ‌దీశాడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Dec 2019 3:00 PM GMT
ఆ పానీపూరీ అబ్బాయి మ‌ళ్లీ ఇర‌గ‌దీశాడు..!

దక్షిణాఫ్రికాతో జరిగిన అండర్‌-19 రెండో వన్డేలో భారత యువ‌ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. యశస్వి జైశ్వాల్‌ ఆల్‌రౌండ్ ప్రతిభ జట్టుకు సునాయ‌స‌ విజయాన్ని అందించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 29.5 ఓవర్లలోనే 119 పరుగులకు ఆలౌటైంది. యశస్వి 4 వికెట్లు తీయ‌గా.. ఆకాశ్‌ సింగ్‌, అంకోలేకర్‌, రవి బిష్ణోయ్‌ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.

అనంత‌రం 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 2 వికె​ట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే ఛేదించింది. బౌలింగ్‌లో అద‌ర‌గొట్టిన యశస్వి అజేయ అర్థసెంచరీతో రాణించాడు. 56 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జురెల్‌ 26 పరుగులు చేయగా, ప్రియం గార్గ్‌ డకౌటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేయడంతో పాటు 4 వికెట్లు పడగొట్టిన య‌శ‌స్వీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకున్నాడు. దీంతో తన 18వ పుట్టినరోజును తీపిగుర్తుగా మలుచుకున్నాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ 2-0తో భారత్‌ సొంతం చేసుకుంది. మూడో వన్డే సోమవారం జరుగుతుంది.

ఇదిలావుంటే.. ఇటీవల జరిగిన ఐపీఎల్‌-2020 వేలంలో యశస్వి జైశ్వాల్ ను రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.2.4 కోట్లకు సొంతం చేసుకుంది. కొద్ది కాలం క్రితం వ‌ర‌కూ రోడ్డుపై పానీపూరీలు అమ్మిన యశస్వికి ఇంత‌ భారీ మొత్తం లభించడం విశేషం. అందుకే క‌ష్టే ప‌లి అన్నారు పెద్ద‌లు.

Next Story