స్పీకర్‌ స్థానంలో ఉంటూ మీరూ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Nov 2019 11:20 AM GMT
స్పీకర్‌ స్థానంలో ఉంటూ మీరూ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు..!

ముఖ్యాంశాలు

  • స్పీకర్‌ తమ్మినేనికి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు బహిరంగ లేఖ
  • సభాపతి స్థానం విలక్షణమైనది, విశిష్టమైనది: యనమల

అమరావతి: స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు బహిరంగ లేఖ రాశారు. స్పీకర్‌ స్థానంలో ఉంటూ మీరు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు గతంలో ఈ స్థానంలో ఉంటూ ఎవరూ చేయలేదనేది సుదీర్ఘకాలంగా సభలో ఉన్న మీకు తెలియందికాదన్నారు. సభాపతి స్థానం విలక్షణమైనది, విశిష్టమైనదన్నారు. రాజ్యాంగపరమైన ఆంక్షల విషయమే కాదు, పార్లమెంటరీ వ్యవస్థలో ఆ స్థానానికి ఎంతో గౌరవం ఉందన్నారు. జి.వి. మౌలాలంకర్‌, ఎంఏ అయ్యంగార్‌, నీలం సంజీవరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు తదితరులు ఎందరో ఆ స్థానానికి వన్నె తెచ్చారని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. నేను సీతాకోక చిలుకను కాదు.. గొంగళిపురుగు అంటే గొంగళి పురుగుగానే చూస్తారని యనమల అభిప్రాయపడ్డారు.

నిరాధార ఆరోపణలు చేయడం స్పీకర్‌ స్థానంలో ఉన్నవారికి తగదన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం స్పీకర్‌ స్థానానికే కళంకమని యనమల పేర్కొన్నారు. వ్యక్తులకు కించపరచాలనే ఉద్దేశంతో వ్యక్తిగత ప్రకటనలు చేశానని సమర్ధించుకోవడం రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి తగదన్నారు. వ్యక్తిగా విమర్శలు చేసినప్పుడు ప్రతివిమర్శ చేసే హక్కు వారీకి ఉంటుందన్నారు. శాసనసభ బయట ఒక ఎమ్మెల్యేగా, ఒక సామాన్యుడిగా మాట్లాడాను అనుకుంటే, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బిజినెస్‌ రూల్స్‌ 168, 169 మీకెందకు వర్తించకూడదని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. స్పీకర్‌గా విశిష్టమైన స్థానంలో ఉంటూ ఆ విశిష్టతను దెబ్బతీసే తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.

Next Story