భ‌ర్త శవంతో మూడు రోజులు పాటు ఇంట్లో ఉన్న భార్య‌.. ఎందుకంటే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2020 3:34 PM GMT
భ‌ర్త శవంతో మూడు రోజులు పాటు ఇంట్లో ఉన్న భార్య‌.. ఎందుకంటే

భర్త చ‌నిపోయి మూడు రోజులైన తెలుసుకోలేని మాన‌స్థితి ఆ ఇల్లాలిది. మూడు రోజులు భ‌ర్త శవంతోనే స‌హ‌వాసం చేసింది. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికి ఎవ‌రూ రాక‌పోవ‌డంతో భ‌ర్త చ‌నిపోయిన విష‌యం ఆ ఇల్లాలికి చెప్పేవారే క‌రువ‌య్యారు. ఇంట్లో నుంచి భ‌రించ‌లేని దుర్వాస‌న వ‌స్తుండ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ లో బుధ‌వారం వెలుగుచూసింది.

లింబారెడ్డి(70) రిటైర్డ్ వీఆర్వో. ఆయ‌న త‌న భార్య నోముల శకుంత‌ల‌(60)ల‌తో క‌లిసి న్యూహైసింగ్ బోర్డు కాల‌నీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్ద‌రు సంతానం. కొడుకు హైద‌రాబాద్‌లో ఉంటుండ‌గా.. కూతురు విదేశాల్లో ఉంటోంది. అనారోగ్య కార‌ణాల‌తో లింబారెడ్డి మృతి చెందాడు. శకుంత‌ల‌కు మాన‌సిక స్థితి స‌రిగా లేక‌పోవ‌డంతో భ‌ర్త మృతి చెందిన సంగ‌తి తెలుసుకోలేక‌పోయింది. లాక్‌డౌన్ కార‌ణంగా ఎవ‌రి ఇంటికి వారే ప‌రిమితం కావ‌డంతో వారి ఇంటికి ఎవ‌రూ రావ‌టం లేదు. ఆ ఇంటి నుంచి దుర్వాస‌న వ‌స్తుండ‌డంతో ప‌క్కంటి వాళ్లు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసుల‌కు అక్క‌డికి వ‌చ్చి చూడ‌గా.. శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. భ‌రించ‌లేని దుర్వాస‌న వ‌స్తోంది. కాగా.. వృద్దుడు చ‌నిపోయి మూడు రోజులు అయి ఉంటుంద‌ని తెలుస్తోంది. పోలీసులు కుమారుడికి స‌మాచారం అందించారు. త‌న తండ్రి అనారోగ్యంతో మృతి చెందార‌ని, ఈ విష‌యంలో ఎవ‌రిపై అనుమానాలు లేవ‌ని కుమారుడు తెలిపాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Next Story