24గంటల్లోనే 3,970 పాజిటివ్‌ కేసులు, 103 మంది మృతి

By Newsmeter.Network  Published on  16 May 2020 5:09 AM GMT
24గంటల్లోనే 3,970 పాజిటివ్‌ కేసులు, 103 మంది మృతి

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు నమోదు సంఖ్య పెరుగుతోంది. కరోనా నివారణకు ప్రభుత్వం గత నెలన్నరగా లాక్‌డౌన్‌ను విధిస్తూ వస్తుంది. దీంతో ప్రపంచ దేశాల్లో కంటే భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు సంఖ్య తక్కువగానే నమోదయ్యాయి. ఇటీవల కేంద్రం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించింది. దీంతో పలు రంగాలకు చెందిన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. జనసంచారం పెరిగింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపుతో ఇతర ఆయా రాష్ట్రాల్లో ఇరుక్కుపోయినవారంతా తమ స్వస్థలాలకు చేరుతున్నారు.

Also Read :మొబైల్‌ ఫోన్‌ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి!?

ఈ క్రమంలో రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని తెలస్తోంది. ఇదిలాఉంటే గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,970 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 103 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 85,940కి చేరగా, 2752 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 30,153 మంది కోలుకోగా, మరో 53,035 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇదిలాఉంటే దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌లలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్రంలో ప్రతీరోజూ కొత్తగా వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని, శుక్రవారం ఒక్కరోజే 1576 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,100కి చేరిందని, వీరిలో 1068 మంది మృత్యువాత పడినట్లు వివరించారు.

Also Read :బిగ్‌బ్రేకింగ్‌: ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది వలస కూలీలు మృతి

అదేవిధంగా గుజరాత్‌లో 9931 కేసులు నమోదు కాగా 606 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మధ్యప్రదేశ్‌లో 4595 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 239 మంది మృతిచెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలాఉంటే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కరోనా పాజిటివ్‌ కేసుల ఉధృతి కొంతమేర తగ్గినట్లేనని చెప్పవచ్చు. తెలంగాణలో నిన్న ఒక్కరోజు 40 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీలోనూ 102 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story