అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు.
శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్న ఆయన ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఇక తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని, 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు.