తెలుగు రాష్ట్రాలకు వేసవి సెగలు.. 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు: ఐఎండీ హెచ్చరిక

ఈ ఏడాది వేసవి కాలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత కఠినంగా ఉండబోతోంది. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే...

By -  అంజి
Published on : 1 March 2026 9:39 AM IST

IMD Heatwave Alert, Telangana Summer 2026, Andhra Pradesh Weather, Above Normal Temperatures, Mrutyunjay Mohapatra, Public Health Risk, La Nina, El Nino, Climate Change India

తెలుగు రాష్ట్రాలకు వేసవి సెగలు.. 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు: ఐఎండీ హెచ్చరిక

ఈ ఏడాది వేసవి కాలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత కఠినంగా ఉండబోతోంది. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే ఈసారి సగటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

వడగాల్పుల తీవ్రత: మార్చి నుంచి మే వరకు తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో 3 రోజుల నుంచి 15 రోజుల వరకు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

45 డిగ్రీల మార్క్: ఈ వేసవిలో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్‌లోనే హైదరాబాద్‌లో 42 డిగ్రీలు దాటగా, ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చు.

ప్రభావితమయ్యే జిల్లాలు: తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

ప్రజారోగ్యంపై ప్రభావం: పెరుగుతున్న ఎండల వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, బయట పనిచేసే కూలీలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. నీటి వనరుల కొరత, విద్యుత్ డిమాండ్ పెరగడం వంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

వాతావరణ పరిస్థితుల విశ్లేషణ:

ఐఎండీ నివేదిక ప్రకారం, ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలహీనమైన 'లా నినా' పరిస్థితులు ఉన్నాయి. అయితే, రాబోయే నెలల్లో 'ఎల్ నినో సదరన్ ఆసిలేషన్' పరిస్థితులు తటస్థంగా మారే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆసక్తికరమైన విషయమేమిటంటే, 2001 తర్వాత దేశవ్యాప్తంగా అతి తక్కువ వర్షపాతం నమోదైన ఫిబ్రవరి ఇదే కావడం గమనార్హం. అలాగే, ఈసారి ఫిబ్రవరిలో ఎక్కడా శీతల గాలులు వీయలేదు, ఇది వేసవి తీవ్రతకు సంకేతంగా కనిపిస్తోంది.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ప్రభుత్వ యంత్రాంగాలు ఇప్పటికే వేసవి కార్యాచరణను సిద్ధం చేయాలని ఐఎండీ సూచించింది. ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకుండా ఉండటం, సరిపడా నీరు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

Next Story