తెలుగు రాష్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌.. మరో 3 రోజుల పాటు వర్షాలు

రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

By అంజి  Published on  22 March 2023 4:57 AM GMT
Rain alert, Telugu states, IMD

తెలుగు రాష్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌.. మరో 3 రోజుల పాటు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్‌ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం నాడు కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణ: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈనెల 24, 25తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాష్ట్రంలోని అనేక జిల్లాలకు మార్చి 24 నుండి 26 వరకు భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

హైదరాబాద్‌: మార్చి 24, 25 తేదీలలో నగరంలోని మొత్తం ఆరు జోన్‌లు - చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో కూడా వర్షాలు పడే ఛాన్స్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ నగరంలో ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది.

ఇటీవల కురిసిన వర్షాలు, ఉరుములు, వడగళ్ల వానల నేపథ్యంలో హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రత నుంచి 2.8-5.8 డిగ్రీల సెల్సియస్‌ తగ్గుదల నమోదయ్యాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షపాతం, వడగళ్ల వాన వేసవి వేడి నుండి చాలా అవసరమైన ఉపశమనాన్ని అందించింది.

ఐఎండీతో పాటు, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 నుంచి 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లోని అన్ని సర్కిళ్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Next Story