ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలో రానున్న మూడు రోజులు (17వ తేదీ వరకు) వర్షాల తీవ్రత అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు.. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి. అటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ భారీ వర్ష సూచన ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.