ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఏపీని మిచౌంగ్ తుపాను ముంచేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 7:04 AM IST
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఏపీని మిచౌంగ్ తుపాను ముంచేసిన విషయం తెలిసిందే. బాపట్ల వద్ద తీరం దాటింది. నాలుగైదు రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. రైతుల పంటలు నీట మునిగి వారు తీవ్రంగా నష్టపోయారు. అయితే.. మిచౌంగ్ తుపాను ప్రస్తుతం ఛత్తీస్గఢ్ సమీపంలో ఉంది. దీని ప్రభావం ఇంకా కనిపిస్తోంది. ఈ తుపాను కారణంగా ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, కాకినాడ, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు.. ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూర, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, సత్యసాయి, అనంతపురం, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవానలని సూచిస్తున్నారు.
మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు, మన్యాన్ని దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. కొద్దిరోజులుగా ఉదయం వేళ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో.. ఉదయం 8 గంటలు దాటితే కానీ జనాలు రోడ్డుపైకి రాలేకపోతున్నారు. మరోవైపు జాతీయరహదారుల్లో రోడ్డు కనిపించిక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఎదురుగా వస్తున్న బండి కూడా కనిపంచడం లేదు. ఉదయం వేల కూడా లైట్లు వేసుకుని మెల్లిగా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే.. ఈ పొగమంచు ప్రకృతి ప్రేమికులను మాత్రం ఆహ్లాదపరుస్తోంది. వాతావరణం ఆకట్టుకుంటోంది.