Super El Nino: ముంచుకొస్తున్న కరవు.. 2027 వరకు గడ్డుకాలమే.. నిపుణుల హెచ్చరిక!
పసిఫిక్ సముద్రం వేడెక్కుతోంది. రాబోయేది మాముల ఎల్ నినో కాదు. ఏకంగా సూపర్ ఎల్ నినో అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
By - అంజి |
Super El Nino: ముంచుకొస్తున్న కరవు.. 2027 వరకు గడ్డుకాలమే.. నిపుణుల హెచ్చరిక!
పసిఫిక్ సముద్రం వేడెక్కుతోంది. రాబోయేది మాముల ఎల్ నినో కాదు. ఏకంగా సూపర్ ఎల్ నినో అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల 2027 వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎండలు మండిపోతాయి. ఇండియాలో వర్షాలు కురవక సాగు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దక్షిణ అమెరికాలో భారీ వరదలు, ఆసియాలో కరవు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వాతావరణం అల్లకల్లోలంగా మారనుంది. దీనికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న 'లా నినా' (La Niña) వాతావరణ పరిస్థితి ముగిసి, ఈ ఏడాది ద్వితీయార్థంలో అత్యంత శక్తివంతమైన 'ఎల్ నినో' ఏర్పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి తీవ్రతను నమోదు చేసే అవకాశం ఉందని, దీనిని 'సూపర్ ఎల్ నినో'గా పేర్కొంటున్నారు. సాధారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితే దానిని ఎల్ నినో అంటారు. కానీ, ఈ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితేనే దానిని 'సూపర్ ఎల్ నినో'గా పరిగణిస్తారు.
ఇంతకుముందు 1982, 1998, 2015 సంవత్సరాల్లో మాత్రమే ఇటువంటి అత్యంత శక్తివంతమైన ఎల్ నినో పరిస్థితులు కనిపించాయి. సుమారు పదేళ్ల తర్వాత మళ్ళీ 2026లో ఇటువంటి పరిస్థితి తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే.. మరికొన్ని చోట్ల తీవ్రమైన కరువు కాటకాలు, అడవి మంటలు (wildfires) సంభవించే ప్రమాదం ఉంది. ఇది పర్యావరణానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
ముంచుకొస్తున్న మార్పులు:
వచ్చే నెలలో 'లా నినా' ముగిసి 'ENSO-neutral' (తటస్థ) స్థితికి చేరుకుంటుందని, ఆ తర్వాత వేసవి చివరి నాటికి లేదా శీతాకాలం నాటికి ఎల్ నినో బలంగా మారుతుందని NOAA తెలిపింది. ప్రస్తుత తుఫానుల కదలికలు, సముద్ర ఉష్ణోగ్రతలను గమనిస్తే, ఇది చరిత్రలో అత్యంత తీవ్రమైన వాతావరణ మార్పులలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని లూసియానా స్టేట్ యూనివర్సిటీ నిపుణులు డాక్టర్ బారీ కీమ్ అభిప్రాయపడ్డారు. దీనిపై నిరంతరం నిఘా ఉంచుతామని, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తామని అధికారులు వెల్లడించారు.