అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం కారణంగా నేడు, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
By అంజి
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం కారణంగా నేడు, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేడు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) September 1, 2025
ఈశాన్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే 12 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. నేడు విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కృష్ణా,గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు.
ఈశాన్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 1, 2025