నేడు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో ఆ రోజున భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఉద్యానవన రైతులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నేడు అల్లూరి, మన్యం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అటు తెలంగాణలో మరో 4 రోజుల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. నేడు నిర్మల్, నిజామాబాద్, ములుగు ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. అదే సమయంలో కర్ణాటక, తమిళనాడులోనూ ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అనుకున్న విధంగా జరిగితే రెండు మూడు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణలోనూ విస్తరిస్తాయని భావిస్తోంది. నైరుతి రుతు పవనాల రాకతో జూన్ రెండోవారం నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతవరణ శాఖ పేర్కొంది.