తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతాం: కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లను పెంచే ప్రయత్నం చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  30 July 2023 10:57 AM GMT
Kishan Reddy, ST Reservation, Telangana, BJP,

తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతాం: కిషన్‌రెడ్డి

తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా అయితే వరదలతో అతలాకుతలం అయ్యింది. ఈ క్రమంలోనే వరద వరంగల్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే అని చెప్పారు కిషన్‌రెడ్డి. అయితే.. లంబాడీల విషయంలో ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. పార్టీకి సంబంధం లేదని చెప్పారు. సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లను పెంచే ప్రయత్నం చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. అవసరమైతే ముందే ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతామని చెప్పారు. పార్లమెంట్ ప్రమేయం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్‌ ద్వారా చేయొచ్చని కిషన్‌రెడ్డి తెలిపారు.

జనాభా ప్రాతిపదికన రాజ్యాంగంలో పొందుపర్చిన విధంగా ఎస్టీ రిజర్వేషన్లు పెంచే వీలుందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కావాలని ముస్లిం రిజర్వేషన్లకు జోడించి.. ఎస్టీ రిజర్వేషన్లు కాకుండా గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో సంక్షేమ పాలన తీసుకొస్తామని కిషన్‌రెడ్డి అన్నారు.

వరద బాధితులకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర బృందాలు వరద నష్టం వివరాలు సేకరిస్తాయని తెలిపారు. కేంద్రం, రాష్ట్రం కలిసి బాధితులను ఆదుకోవాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా బాధితులకు సాయం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న రూ.900 కోట్ల విపత్తు నిధులను వరద బాధితుల కోసం వాడాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరాఉ. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని.. ఇందులో కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం రూ.లక్ష ఇస్తుందని కిషన్‌రెడ్డి చెప్పారు.

Next Story