వరంగల్‌: 9 మృతదేహాల మిస్టరీ వీడింది.. నిద్రమాత్రలు ఇచ్చి చంపేసింది సంజయ్‌.!

By సుభాష్  Published on  24 May 2020 4:11 PM GMT
వరంగల్‌: 9 మృతదేహాల మిస్టరీ వీడింది.. నిద్రమాత్రలు ఇచ్చి చంపేసింది సంజయ్‌.!

సంచలనం సృష్టించిన వరంగల్‌లో 9 మంది మృతదేహాలపై ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. బావిలో తేలిన మృతదేహాలపై మిస్టరీ వీడింది. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెలకుంట బావిలో బుధవారం బయటపడ్డ 9 మంది మృతదేహాలపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. కేసులు ఛేదించారు. అయితే 9 మందిని హత్య చేసింది సంజయ్‌ అని తేలింది. మక్సూద్‌ కుటుంబంతో ఉంటున్ను బుస్రాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సంజయ్.. తనకు అడ్డు రావద్దని మక్సూద్‌ కుటుంబంతో పాటు సన్నిహితంగా ఉన్న బీహార్‌కు చెందిన యువకులను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. 9 మందిని ఎవరైనా హత్య చేశారా..? లేక ఆత్మహత్య చేసుకున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలోనే పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్‌ రిపోర్టుల ద్వారా పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. దీంతో అనుమానితులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా, బుస్రా ప్రియుడు సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ తన స్నేహితులతో కలిసి సామూహిక హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిద్రమాత్రలు ఇచ్చిన సృహ కోల్పోయిన తర్వాత 9 మందిని గోనె సంచిలో పెట్టి బావిలో పడేసినట్లు తేలింది.

కాగా, మక్సూద్‌ కుటుంబం పశ్చిమబెంగాల్ నుంచి వరంగల్‌లోని కరీమాబాద్‌కు 20 ఏళ్ల క్రితం వలస వచ్చింది. గొర్రెలకుంటలోని గోనెసంచీల ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా కరీమాబాద్‌ నుంచి రావడం ఇబ్బందిగా ఉండటంతో మక్సూద్‌ కుటుంబం ఫ్యాక్టరీలోనే ఉంటోంది. ఇక అదే ఆవరణలో శ్యామ్‌, శ్రీరామ్‌ అనే బీహార్‌కు చెందిన యువకులు ఉంటున్నారు.

బుధవారం రోజు మక్సూద్‌ కుటుంబం కనిపించకుండా పోవడంతో ఫ్యాక్టరీ యజమాని సంతోష్ చుట్టుపక్కల గాలించగా, ఓ బావిలో శవాలు కనిపించాయి. ముందుగా నాలుగు శవాలు బయటపడగా, తర్వాత మరో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. శ్యామ్‌, శ్రీరామ్‌ యువకులతో పాటు మక్సూద్‌ ఇద్దరు కుమారుల శవాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మక్సూద్‌ కూతురు బుస్రా వరంగల్‌లోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, భర్తతో విడిపోయిన బుస్రా తన మూడేళ్ల కుమారుడితో వారి వద్దనే ఉంటోంది. వీరితో పాటు గన్నీ సంచుల గోదాం పక్కనే ఉన్న పై అంతస్తులో బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యామ్‌లు ఉన్నారు. ఇక నగరంలోని సంజయ్‌కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తితో బుస్రాం వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో మక్సూద్‌ ఇంట్లో తరచూ గొడవలు కూడా జరిగేవని సమాచారం.

ఇక ఇంటిపైనే ఉంటున్న బీహార్‌కు చెందిన యువకులు శ్రీరాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేసినట్లు పోలీసుల విచారణ తేలింది. విషయం తెలుసుకున్న సంజయ్‌ కుమార్‌ పథకం ప్రకారం ఈ 9 మందిని హతమార్చాడు. పోలీసులు నిందితుడిని సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరందరిని చంపేసింది సంజయ్‌ అయితే అసలు హత్య చేయించిన వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా అనే కోణాలో దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.

Next Story