'అంతా నీ ఇష్టమేనా'.. కోహ్లీ నిర్ణయం పై వెల్లువెత్తుతున్న విమర్శలు

By Newsmeter.Network
Published on : 29 Feb 2020 3:28 PM IST

అంతా నీ ఇష్టమేనా.. కోహ్లీ నిర్ణయం పై వెల్లువెత్తుతున్న విమర్శలు

కివీస్‌ పర్యటనలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. తొలి టెస్టులో విఫలమైన కోహ్లీ రెండో టెస్టులో రాణిస్తాడని అభిమానులు ఆశించారు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో విరాట్‌ కోహ్లీ డిఆర్‌ఎస్‌కు వెళ్లడం విమర్శలకు దారి తీసింది. 15 బంతులు ఆడిన కోహ్లీ 3 పరుగులు మాత్రమే చేశాడు. టీమ్‌ సౌథీ వేసిన ఇన్నింగ్స్‌ 25వ ఓవర్‌ తొలి బంతికి విరాట్‌ కోహ్లీ ఎల్బీ అయ్యాడు. బౌలర్‌ అప్పీల్ చేయగానే అంఫైర్‌ వేలెత్తాడు. అంఫైర్‌ నిర్ణయం పై సందేహాం వ్యక్తం చేస్తూ కోహ్లీ వెంటనే డిఆర్‌ఎస్‌కు వెళ్లాడు. రివ్యూలో కూడా ఔట్‌ అని తేలడంతో కోహ్లీ వెనుదిరిగాడు.

కాగా.. కోహ్లీ రివ్యూకి వెళ్లడం సోషల్ మీడియాలో హాట్‌ టాఫిక్‌ అయ్యింది. క్లియర్‌ అవుట్‌ అని తెలుస్తున్న కోహ్లీ డిఆర్‌ఎస్‌కు వెళ్లడాన్ని పలువురు క్రీడాపండితులు తప్పుపడుతున్నారు. క్రికెట్‌ అనేది వ్యక్తి గత క్రీడ కాదని జట్టు ఆటని అన్నారు. జట్టు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. టెస్టుల్లో కోహ్లీ.. ఎల్బీ నిర్ణయాల్లో కేవలం 15శాతం మాత్రమే సక్సెస్‌ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Virat Kohli Review

2016 నుంచి ఒక బ్యాట్స్‌మన్‌గా కోహ్లి టెస్టుల్లో 14 సార్లు రివ్యూలు కోరితే రెండు సార్లు మాత్రమే సక్సెస్‌ అయ్యాడు. బ్యాట్స్‌మన్‌గా కోహ్లి కోరిన 14లో 9 వ్యతిరేక ఫలితాలు రాగా, మూడు అంపైర్స్‌ కాల్స్‌ అయ్యాయి. ఇక రెండు మాత్రమే కోహ్లికి అనుకూలంగా వచ్చాయి. చివరిసారి 2017-18 సీజన్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టులో మాత్రమే కోహ్లికి అనుకూలంగా నిర‍్ణయం వచ్చింది.

అభిమానులు సైతం కోహ్లీ నిర్ణయం పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కెప్టెన్‌గా అధికారం ఉందని జట్టు ప్రయోజనాల్ని తాకట్టుపెట్టి డీఆర్‌ఎస్‌ నిర్ణయాలను తీసుకుంటావా ఓ అభిమాని ప్రశ్నించగా.. కెప్టెన్‌ అయినంత మాత్రాన ఇలా చేస్తావా అని మరొక అభిమాని విమర్శించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్‌ ఆటగాళ్లలో పృథ్వీ షా(54), చతేశ్వర పుజారా(54), హనుమ విహారి(55)లు మాత్రమే రాణించగా.. మిగిలిన వారు ఘోరంగా విఫలమవ్వడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తక్కువ పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కివీస్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌(27 బ్యాటింగ్‌), టామ్‌ బ్లండెల్‌( 29 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు.

Next Story