తొలిరోజు కివీస్ దే..
By Newsmeter.Network Published on 29 Feb 2020 8:22 AM GMTక్రైస్ట్చర్చ్ వేదికగా శనివారం భారత్తో ప్రారంభమైన రెండో టెస్టులో కివీస్ తన హవాను కొనసాగిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాను 242 పరుగులకే ఆలౌట్ చేసిన న్యూజిలాండ్.. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది.
అంతకముందు.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది టీమిండియా. ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఆరంభంలో ఆచుతూచి ఆడారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద మయాంక్(7).. బౌల్ట్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరగడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. నయావాల్ పుజారాతో జతకలిసిన ఓపెనర్ పృధ్వీ(54) షా చెలరేగి ఆడాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన ఈ యువ ఆటగాడు 8 పోర్లు సాయంతో 54 పరుగులు చేవాడు. జట్టు స్కోర్ 80 పరుగుల వద్ద జేమిసన్ బౌలింగ్లో టామ్ లాథమ్కు క్యాచ్ ఔటైయ్యాడు. అనంతరం పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ(5)తో కలిసి పుజరా(54) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో టీమిండియా 85/2తో లంచ్కు వెళ్లింది.
భోజన విరామం అనంతరం విరాట్ కోహ్లి తన పేలవ ఫామ్ను కొనసాగిస్తూ.. సౌతీ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వెస్కెప్టెన్ రహానే 7 పరుగులే చేసి ఔటవ్వడంతో 113 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. టీ విరామం తరువాత టీమిండియా తడబడింది. జేమిసన్ ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పుజారా ఔటైన తర్వాత రెండు బౌండరీలతో మెరుపులు మెరిపించిన పంత్(12) కూడా జెమీసన్ బౌలింగ్లోనే ఔటైయ్యాడు. ఆ తర్వాత ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించలేదు. రవీంద్ర జడేజా(9), ఉమేష్ యాదవ్(0), మహ్మద్ షమి(16) ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో టీమిండియా 63 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ 45 పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లను కోల్పోవడం గమనార్హం. కివీస్ బౌలర్లలో జెమీసన్ 5 వికెట్లతో సత్తాచాటగా.. టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్లు తలా రెండు వికెట్లు, నీల్ వాగ్నర్ ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కివీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ లాథమ్(27 బ్యాటింగ్), టామ్ బ్లండెల్( 29 బ్యాటింగ్)లు క్రీజ్లో ఉన్నారు. ముందు న్యూజిలాండ్ బౌలింగ్కు దాసోహమైన భారత్.. ఆపై ఆ జట్టు వికెట్లను సాధించడానికి కూడా ఆపసోపాలు పడుతోంది. మొదటి రోజు ఆటలో భారత్ 23 ఓవర్ల పాటు బౌలింగ్ వేసినా వికెట్ను కూడా సాధించలేకపోయింది. దాంతో ప్రస్తుతానికి న్యూజిలాండ్దే పైచేయిగా కనబడుతోంది. న్యూజిలాండ్ ఇంకా 179 పరుగులు తొలి ఇన్నింగ్స్లో వెనకబడి ఉంది. రెండో రోజు భారత బౌలర్లు పుంజుకుని కివీస్ను త్వరగా ఆలౌట్ చేయకుంటే భారత్కు కష్టాలు తప్పవు.