కశ్మీర్‌లో ఎత్తయిన వంతెనపై వందే భారత్ పరుగులు.. వీడియో వైరల్

By Knakam Karthik
Published on : 25 Jan 2025 1:02 PM IST

National News, Jammu Kashmir, VandeBharat Train, Trail Run

కశ్మీర్‌లో ఎత్తయిన వంతెనపై వందే భారత్ పరుగులు.. వీడియో వైరల్

జమ్ముకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిపై మరో వండర్ ఆవిష్కృతమైంది. ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక బ్రిడ్జిపై తొలిసారి వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సెమీ హైస్పీడ్ వందే భారత్ ట్రైన్ ట్రయల్ రన్‌ను భారత రైల్వే శనివారం ప్రారంభించింది. కాత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవీ రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలు ప్రయాణించినట్లు సమాచారం. ఈ మార్గమధ్యంలో చీనాబ్ నదిపై నిర్మించిన మెయిన్ ఆర్చ్‌పై రైలు పరుగులు పెడుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ బ్రిడ్జిని నిర్మించారు. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే బ్రిడ్జి పేరుతో ఉన్న వరల్డ్ రికార్డ్ను ఇది అధిగమించింది.

Next Story