హైదరాబాద్: రోడ్లపై పోకిరీలు ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ఇతరులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బైకులపై వేగంగా వెళ్తూ, స్టంట్లు చేస్తూ తోటి వాహనదారులు ప్రమాదాల బారిన పడేలా చేస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్పహాడ్ వద్ద ఒకే బైక్పై 8 మంది యువకులు ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ స్టంట్లు చేశారు. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ నానా హంగామా సృష్టించారు.
ఈ విషయాన్ని గమనించిన రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెట్టింట పోస్ట్ చేయడమే కాకుండా శంషాబాద్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ సీఐ రాజేందర్ గౌడ్ 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మైనర్లు కూడా ఉన్నారని తెలిపారు. 8 మందిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.