IND Vs ENG: రోహిత్‌ కాళ్లు మొక్కిన ఫ్యాన్‌కు షాక్.. 14 రోజుల రిమాండ్

రోహిత్ నాన్‌ స్ట్రైకర్‌గా ఉన్న సమయంలో దూసుకెళ్లి పాదాలను తాకాడు.

By Srikanth Gundamalla  Published on  28 Jan 2024 7:48 AM GMT
cricket, team india, fan, 14 days remand,  rohit,

 IND Vs ENG: రోహిత్‌ కాళ్లు మొక్కిన ఫ్యాన్‌కు షాక్.. 14 రోజుల రిమాండ్

హైదరాబాద్‌ వేదికగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. అయితే.. నాలుగో రోజు ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 420 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఇంగ్లండ్ బ్యాటర్ డబుల్‌ సెంచరీ మిస్‌ అయ్యింది. కాగా.. తొలి టెస్టును గెలిచేందుకు టీమిండియా బ్యాటర్లు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఈ టెస్టు తొలి రోజు సందర్భంగా ఒక సంఘటన చోటుచేసుకుంది. భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తుండగా.. ఉప్పల్‌ స్టేడియం గ్రౌండ్‌లోకి ఓ అభిమాని దూసుకెళ్లాడు.

విరాట్‌ కోహ్లీ 18 నెంబర్ జెర్సీని వేసుకున్న క్రికెట్ అభిమాని నేరుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వద్దకు వెళ్లాడు. రోహిత్ నాన్‌ స్ట్రైకర్‌గా ఉన్న సమయంలో దూసుకెళ్లి పాదాలను తాకాడు. హిట్‌మ్యాన్‌ను కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు.. కానీ కుదరలేదు. ఇక వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది గ్రౌండ్‌లోకి వెళ్లి సదురు అభిమానిని బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నెటిజన్లు అతను అదృష్టవంతుడు అంటూ కామెంట్స్ చేశారు. అయితే.. సదురు అభిమాని ప్రస్తుతం చిక్కుల్లో పడ్డాడు.

అతను నిబంధనలు ఉల్లంఘించి గ్రౌండ్‌లోకి దూసుకెళ్లడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. భారీ సెక్యూరిటీని చేదించుకుని వెళ్లినందుకు గాను ఈ సంఘటనను పోలీస్‌ శాఖ సీరియస్‌గా తీసుకుంది. సదురు వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఆ తర్వాత కోర్టులో హాజరు పర్చగా.. యువకుడిని న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ను విధించింది. కాగా.. సదురు యువకుడు ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన హర్షిత్ రెడ్డిగా పోలీసులు చెప్పారు. అతని వయసు 20 ఏళ్లుగా వెల్లడించారు. ఇక హర్షిత్‌ రెడ్డికి కోర్టు రిమాండ్‌ విధించడంతో చిక్కుల్లో పడినట్లు అయ్యింది.


Next Story