Fact Check : లడఖ్ లో ఎం17 విమానం కూలిపోయిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2020 7:17 AM GMT
Fact Check : లడఖ్ లో ఎం17 విమానం కూలిపోయిందా..?

ఎం17 హెలికాఫ్టర్ లడఖ్ లో కూలిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. కొందరు పాకిస్థానీ జర్నలిస్టులు కూడా విమానం కూలిపోవడంపై ట్వీట్లు పెట్టారు. ఫేస్ బుక్ లో కూడా పలువురు దీనిపై పోస్టులు పెట్టారు.

Indians please check is this your M 17 crashed in Laddakh? We will keep you posted of any developments అంటూ సెప్టెంబర్ 13న పోస్టులు పెట్టారు.

నిజంగానే ఎం17 కూలిపోయిందా..? అని కూడా పలువురు పోస్టులు పెట్టారు. పర్వత ప్రాంతాల్లో విమానం పక్కకు ఒరిగినట్లు కనిపించింది. విమానం పైన ఓ వ్యక్తి కూర్చుని ఉండడం గమనించవచ్చు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

ఈ ఫోటో 2018 సంవత్సరానికి సంబంధించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలీకాఫ్టర్ కు ప్రమాదం చోటు చేసుకున్న ఫోటో..!

ఈ ఫోటోకు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ సంఘటనకు సంబంధించి చాలా ఆర్టికల్స్ దొరికాయి. ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ వద్ద ఏప్రిల్ 2018న ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదానికి సంబంధించిన లైవ్ వీడియో ఫుటేజీని NDTV యూట్యూబ్ ఛానల్ లో చూడొచ్చు. ఏప్రిల్ 2018న వీడియోను అప్లోడ్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ట్రాన్స్పోర్ట్ హెలీకాఫ్టర్ కేదార్ నాథ్ ఆలయం దగ్గర ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డు అయింది.

ఏప్రిల్ 3, 2018న Times of India కథనం ప్రకారం ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోగా.. ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన కార్గో హెలీకాఫ్టర్ కు ప్రమాదం చోటుచేసుకుందని.. ల్యాండింగ్ సమయంలో ఇనుప దూలాలకు తగలడం వలన ప్రమాదం జరిగిందని తెలిపింది.

India TV news, News18 కూడా ఏప్రిల్ 2018న చోటుచేసుకున్న ప్రమాదంపై కథనాలను ప్రచురించాయి.

Opindia Hindi ఈ వైరల్ పోస్టులు అబద్ధం అంటూ తేల్చేశాయి.

2018లో కేదార నాథ్ లో చోటుచేసుకున్న విమాన ప్రమాదాన్ని ప్రస్తుతం లడఖ్ లో చోటుచేసుకున్న ప్రమాదం అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు. ఈ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

Next Story