రేపు ఒడిశాకు సీఎం జగన్‌

CM Jagan Visits Odisha For Tomorrow. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రేపు ఒడిశా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఉభయరాష్ట్రాలకు

By Medi Samrat  Published on  8 Nov 2021 2:56 PM GMT
రేపు ఒడిశాకు సీఎం జగన్‌

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రేపు ఒడిశా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఉభయరాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై రేపు సాయంత్రం ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో చర్చలు జ‌రుప‌నున్నారు. ఈ మేర‌కు ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో నేడు సీఎం సన్నాహక సమావేశం ఏర్పాటుచేశారు. భేటీలో మూడు అంశాలపై ఒడిశా సీఎంతో ఏపీ సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై చర్చించనున్నార‌ని స‌మాచారం.

వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం అంశాన్ని ఒడిశా సీఎంతో రేపు జరిగే చర్చల్లో ఏపీ సీఎం జ‌గ‌న్‌ ప్రస్తావించనున్నారు. నేరడి బ్యారేజీ కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను నవీన్‌ పట్నాయక్‌కు సీఎం జ‌గ‌న్‌ వివరించనున్నారు. బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా వైపునుంచి 103 ఎకరాలు అవసరమని ఇందులో 67 ఎకరాలు రివర్‌బెడ్‌ ప్రాంతమేనని ఈరోజు జ‌రిగిన స‌మీక్ష‌లో అధికారులు సీఎంకు తెలిపారు. బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని వివ‌రించారు.

జంఝావతి ప్రాజెక్టు అంశంపై కూడా రేపటి సమావేశంలో ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం రబ్బర్‌ డ్యాం ఆధారంగా సాగునీరు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. 24,640 ఎకరాల్లో కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని సీఎంకు వివ‌రించారు. ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టును పూర్తిచేస్తే ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలిపారు. ఒడిశాలో దాదాపు 1174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని.. ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని తెలిపారు. ఈ నేఫ‌థ్యంలో ఆర్‌ అండ్‌ ఆర్‌కు సహకరించాలని ఏపీ సీఎం ఒడిశాను కోరనున్నారు.

స‌మీక్ష‌లో కొఠియా గ్రామాల వివాదానికి సంబంధించిన మొత్తం వివరాలను సీఎం ముందు ఉంచారు అధికారులు. కొఠియా గ్రామాల్లో ఇటీవల పరిణామాలను వివరించారు అధికారులు. 21 గ్రామాల్లో 16 గ్రామాలు ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని విజయనగరం జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి సీఎంకు వివరించారు. ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించామని అధికారులు పేర్కొన్నారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87శాతానికి పైగా గిరిజనులు ఉన్నారని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు.


Next Story