హరీష్‌రావు వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2020 12:32 PM GMT
హరీష్‌రావు వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయి

దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి సందేహం వ్యక్తం చేశారు. హరీష్ వ్యాఖ్యలపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఎన్నికలకు ముందే ఫలితాలు ఏ విధంగా ఉండాలో టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించే స్థాయికి వెళ్లి పోయిందంటే.. అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు స్పష్టత వచ్చి ఉంటుందని విజ‌య‌శాంతి రాసుకొచ్చారు. హరీష్ రావు కామెంట్ చూస్తూ ఉంటే.. దుబ్బాక లో పోలింగ్ జరిగిన తర్వాత.. కెసిఆర్ గారి ఫామ్ హౌస్‌లో ఈవీఎం మిషన్లను పెట్టి, ఓట్లను లెక్కిస్తారో ఏమో? అనే అనుమానం కలుగుతోందని సందేహం వ్య‌క్తం చేశారు.

అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టిఆర్ఎస్ పార్టీ.. ముఖ్యంగా హరీష్ రావు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదని.. కాంగ్రెస్, బిజెపిలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీష్ రావు గారి మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కెసిఆర్ గారు ఏదన్నా అల్టిమేటం జారీ చేశారా? అన్న చర్చ కూడా జరుగుతోందని.. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే.. దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కువగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారని విజ‌యశాంతి పేర్కొన్నారు.

Next Story