చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ : ఎంపీ విజయసాయి రెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 3:10 PM GMT
చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ : ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖ: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పండగలా చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తెలుగు భాషా ప్రాధాన్యత తెలిసేలా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతామన్నారు. గత ఐదేళ్లూ బాబు ఆంధ్ర రాష్ట్ర దినోత్సవ వేడుకలు మరిచిపోయారని విమర్శించారు.బెంజ్ సర్కిల్ లో దీక్షలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడమే బాబుకు తెలుసని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ విభాగంలో చంద్రబాబు రూ.68 వేల కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశారని విమర్శించారు.

విశాఖలో భాగస్వామ్య సదస్సు లపై కామర్స్ శాఖకు లేఖరాస్తే వివరాలు లేవన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో విశాఖకు మహర్దశ పట్టనుందన్నారు. విశాఖ కేంద్రంగా అపారమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. టీడీపీ హయాంలో విశాఖను భూ కుంభకోణాలకు నిలయంగా మార్చారని విమర్శించారు. విశాఖ భూములపై సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందని చెప్పారు. భూ కుంభకోణంలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవన్నారు. గత ప్రభుత్వం సిట్ నివేదికను బయటపెట్టలేదని చెప్పారు. సిట్ విచారణ పరిధిని పెంచే ఆలోచన ఉందన్నారు. అనకాపల్లి, యలమంచిలి ప్రాంతాలను సిట్ పరిధిలోకి తేవాలని కోరతామన్నారు. సిట్ ఫిర్యాదుల స్వీకరణ గడువు పెంచాలన్నారు.

చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్.... ఇది అందరికీ తెలిసిన విషయమేనన్నారు విజయసాయి రెడ్డి. రాజకీయాల్లో సినిమా స్టిల్స్ పనికిరావన్నారు. ప్రజా సమస్యలు తీరుస్తారని జనం నమ్మితే పవన్ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు.లోకేష్ దీక్ష వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఐదేళ్లూ ఆహార దీక్ష.... ఐదు గంటలు నిరాహార దీక్షా? అంటూ ఎద్దేవా చేశారు

జర్నలిస్ట్ లు అంటే సీఎంకు గౌరవం ఉందన్నారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగే చర్యలు ఉండవని విజయసాయి రెడ్డి చెప్పారు. కులాల వారీగా మీడియాను విభజించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ , డివిజన్ రెండూ ఉండేలా ప్రధాని మోడీ సీఎం జగన్‌కు హామీ ఇచ్చారన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే జగన్ ధ్యేయమన్నారు. పోలవరంపై హైకోర్టు తీర్పు సంతోషకరమని.. పోలవరం ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేస్తామన్నారు విజయసాయి రెడ్డి.

Next Story