మోహన్ బాబు ఇంట్లోకి దూసుకెళ్లి.. మిమ్మల్ని వదలబోమంటూ వార్నింగ్..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 2 Aug 2020 12:30 AM GMT
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంటి దగ్గర ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లిన కొందరు దుండగులు మిమ్మల్ని వదలబోమంటూ వార్నింగ్ ఇచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఏపీ 31 ఏఎన్ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు తెలుస్తుంది. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మోహన్ బాబు నివాసంలోకి ఓ కారులో దూసుకెళ్లిన దుండగులు మిమ్మల్ని వదలబోమంటూ ఆయన కుటుంబ సభ్యులను హెచ్చరించారు. మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా లేని సమయంలో దూసుకెళ్లిన కారులో నుండి దిగిన వ్యక్తులు సీరియస్ వార్నింగ్ ఇచ్చి అదే కారులో వెళ్లిపోయారు. ఈ ఘటనతో మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మోహన్ బాబు కుటుంబం. ఎవరా వ్యక్తులు, వారితో మోహన్ బాబు కుటుంబానికి ఏమిటీ వివాదం అన్నది తెలియాల్సి ఉంది.