హైదరాబాద్: బస్సుల్లో ప్రయాణించాలంటే ఈ నిబంధనలు పాటిచాల్సిందే..

By సుభాష్  Published on  19 May 2020 4:43 AM GMT
హైదరాబాద్: బస్సుల్లో ప్రయాణించాలంటే ఈ నిబంధనలు పాటిచాల్సిందే..

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్ని మంగళవారం నుంచి రోడ్డెక్కాయి. అయితే ఆర్టీసీ బస్సుల్లో కొన్ని కండీషన్లు విధించింది ప్రభుత్వం. ఆ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం కేసీఆర్‌. నిన్న హైదరాబాద్ లో జరిగిన కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

హైదరాబాద్‌ తప్ప మంగళవారం నుంచి అన్ని జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ కారణంగా 56 రోజులుగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు.. ఇప్పుడు రైట్‌ .. రైట్‌ .. అంటూ బయలుదేరాయి.

ఆర్టీసీ బస్సులకు నిబంధనలివి..

మే 31 వరకూ జిల్లాల్లో మాత్రమే బస్సులు నడుస్తాయి. హైదరాబాద్‌లో సిటీ బస్సులకు అనుమతి లేదు.

- హైదరాబాద్‌ సరిహద్దుల వరకూ బస్సులు నడుస్తాయి

- తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు తిరగవు

- నల్గొండ వైపు నుంచి వచ్చే బస్సులను ఎల్బీనగర్‌ దగ్గర నిలిపివేస్తారు

- మహబూబ్‌నగర్ నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్‌ వద్ద నిలిపివేస్తారు

- నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ నుంచి వచ్చే బస్సులన్నీ జేబీఎస్‌ వరకే

- ఆర్టీసీ బసులన్నింటికీ ముందుగానే శానిటైజర్‌ చేస్తారు

- ఆర్టీసీ కార్మికులకు డిపోలోకి వెళ్లే ముందు థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి

- జూన్‌ నుంచి హైదరారాబాద్‌ సిటీ బస్సులకు అనుమతి ఇచ్చే అవకాశం

- ప్రైవేటు బస్సులు, సొంత వాహనాలు తిరిగేందుకు అనుమతి

- జూబ్లీ బస్టాండు వరకు మాత్రమే బస్సులు వస్తాయి. ఎంజీబీఎస్‌కు అనుమతి లేదు

- ఆర్టీసీ బస్సులన్నీ రాత్రి 7 గంటల వరకూ డిపోలకు చేరాలి

- ప్రయాణికులకు మాస్కులు తప్పనిసరి, లేకపోతే అనుమతి లేదు

- ప్రయాణికుల వెంట శానిటైజర్‌ తప్పనిసరి

- శానిటైజర్ లేని ప్రయాణికులకు బస్టాండులో శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి

- భౌతిక దూరం తప్పనిసరి

కొత్త నిబంధనల ప్రకారం..

ఇక లాక్‌ డౌన్‌ నుంచి బస్సులకు సడలింపు ఇవ్వడంతో కొత్త నిబంధనల ప్రకారం.. తెలంగాణలో మొత్తం 10460 బస్సుల్లో 6082 బస్సులు ప్రస్తుతం రోడ్డెక్కాయి. కాగా, సీట్ల మధ్య గ్యాప్ ఉండాలని కేంద్రం సూచించింది. దీనిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

అయితే తెలంగాణలో సీట్ల మధ్య గ్యాప్‌ ఉండాలంటే టికెట్ల ధరలు 33 శాతం పెంచాల్సి ఉంటుందని అధికారులు తెలుపడంతో, మొత్తం సీట్లలో ప్రయాణికులను కూర్చోనివ్వాలని కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకుంది.

Next Story