ఒక్క ఓటుతో ఒకరికి మోదం.. ఇంకొకరికి ఖేదం

By అంజి  Published on  26 Jan 2020 6:14 AM GMT
ఒక్క ఓటుతో ఒకరికి మోదం.. ఇంకొకరికి ఖేదం

ఒక్క ఓటు.. ఒక్కటంటే ఒక్క ఓటు.. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీ కొంపల్లిలో మూడో వార్డులో గెలుపెవరిదో, ఓటమెవరిదో నిర్ణయించింది. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన కౌంటింగ్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి శ్రీశైలం యాదవ్ కేవలం ఒక్క ఓటు ఆధిక్యతతో బిజెపి అభ్యర్థి మోహన్ రెడ్డిని ఓడించారు. ఒక్క ఓటు గెలుపుతో శ్రీశైలం యాదవ్ ఒక రకంగా రికార్డు సృష్టించారు. ఆయన కొంపల్లి పంచాయితీగా ఉన్నప్పుడు సర్పంచ్ గా కూడా పనిచేశారు.

మూడు గంటల పాటు ఉక్కిరిబిక్కిరి చేసిన కౌంటింగ్ ప్రక్రియలో ఒక క్షణం త్రాసు మోహన్ రెడ్డి వైపు మొగ్గితే మరో వైపు యాదవ్ వైపు మొగ్గింది. ఒక క్షణం యాదవ్ ముఖం వెలిగితే మరో క్షణం మోహన్ రెడ్డి ముఖం వంద వాట్ల బల్బు అయింది. రెండు సార్లు రీకౌంటింగ్ జరిగింది. అధికారులు, అభ్యర్థులు టెన్షన్ తో గడిపారు. చివరికి యాదవ్ కు ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. దాంతో అధికారులు జిల్లా ఎన్నికల అధికారికి విషయం తెలియచేసి, వారి అనుమతితో ఫలితాన్ని ప్రకటించారు. తాము అన్ని నియమనిబంధనలను, విధి నిషేధాలను పరిశీలించిన తరువాతే ఫలితాన్ని ప్రకటించామని ఎన్నికల అధికారి శంకర్ చెప్పారు.

అయితే వెంట్రుక వాసిలో ఓడిపోయిన బిజెపి అభ్యర్థి మాత్రం అధికారులు పక్షపాత వైఖరిని అవలంబించారని ఆరోపిస్తూ ధర్నాకి దిగారు. పోలీసులు ఆయనన్ని అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. మోహన్ రెడ్డికి ఏవైనా అభ్యంతరాలుంటే కో్ర్టుకు వెళ్లవచ్చునని కొంపల్లి మునిసిపల్ కమీషనర్ అరుణ జ్యోతి చెప్పారు.

ఒక్క వోటుతో గెలిచిన శ్రీశైలం యాదవ్ ఆనందోత్సవాలు చేసుకుంటుంటే, ఒకే ఒక్క వోటుతో ఓడిన మోహన్ రెడ్డి విషాదంలో మునిగిపోయారు. యాదవ్ కు మోదం, రెడ్డికి ఖేదం... ఇలా కొంపల్లి మూడో వార్డు పోరాటం కథ ముగిసింది.

కొతుల బెడదకు పరిష్కారం చూపించిన మల్లారెడ్డి..

సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపాలిటీలో ఓ స్వతంత్ర అభ్యర్థి గెలుపుకు కొండముచ్చులు కారణమయ్యాయి. దుబ్బాక మునిసిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్‌లో గత సంవత్సం విపరీతంగా కోతుల బెడద ఉండేది. స్థానిక కాలనీల్లో కోళ్ల గుంపులు తిరుగుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేసేవి. ఇళ్లపై తిరుగుతూ ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లేవి. పంట పొలాలను నాశానం చేస్తూ.. స్థానికులపై దాడికి దిగేవి. ఈ సమస్యకు మట్ట మల్లారెడ్డి పరిష్కారం ఆలోచించాడు. రెండు కొండ ముచ్చులను కొనుక్కొచ్చారు. కొండముచ్చులను చూసిన కోతులు అక్కడి నుంచి తమ స్థవరాన్ని వేరే చోటుకు మార్చుకున్నాయి. మల్లారెడ్డి చేసిన ఈ పనికి అక్కడున్న స్థానికులు అందరూ ప్రశంసించారు. మల్లారెడ్డి చేసిన ఈ సేవకు గానూ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అతనికి ఘన విజయాన్ని కట్టబెట్టారు.

Next Story