ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్పై దాడి..!
By సుభాష్ Published on 12 July 2020 1:24 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కష్టాలతో కొట్టుమిట్టాడుతుంటే కేసీఆర్ మాత్రం ఫాంహౌస్లో ఉంటారా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల కేంద్ర సహాయాన్ని కూడా అందుకోలేకపోతున్నామని అన్నారు. కేసీఆర్, కేటీఆర్లు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, కరోనా కాలంలో తెలంగాణకు కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేకుల చేతిలో పెట్టాడని దుయ్యబట్టారు. కేసీఆర్ పెద్ద కొడుకుకు ఓవైసీ అని కాంగ్రెస్ దేశానికి పట్టిన దరిద్రమిన మండిపడ్డారు. అయితే వరంగల్లో ఆత్మనిర్భర్ భారత్ అభియనా పై మీడియా కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే మీడియా సమావేశం అనంతరం ఎంపీ అరవింద్ బయటకు వెళ్తున్న సమయంలో కొంత మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వచ్చారు. దీంతో ఎంపీ అరవింద్ వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఎంపీ కాన్వాయ్పై దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోటాపోటీగా నినాదాలు చేసుకున్న ఇరు పార్టీల నేతల మధ్య కొంత తోపులాట జరిగింది. దీంతో పోలీసుల టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ దాడిని తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్లో ఉన్న కొంత మంది హిందూ వ్యతిరేకులు నాపై దాడికి తెగబడ్డారని ఎంపీ అరవింద్ మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా జాతీయ రహదారిపై నా వాహనాన్ని వెంబడించారని అన్నారు. ఒక ప్రజాప్రతినిధిపై పట్టపగలు దాడి జరగడం దారుణమని వ్యాఖ్యనించారు.