పీయం మోడీకి ఎనిమిది ప్రశ్నలు, సమాధానం కావాలి - ఎమ్మెల్సీ కవిత

By -  Nellutla Kavitha |  Published on  30 May 2022 11:15 AM GMT
పీయం మోడీకి ఎనిమిది ప్రశ్నలు, సమాధానం కావాలి - ఎమ్మెల్సీ కవిత

గత 8 సంవత్సరాల పరిపాలనలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎనిమిది ప్రశ్నలు సంధించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తన ఎనిమిది ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలంటూ లేఖను విడుదల చేశారు కవిత.

మహిళా శక్తికి సమాన ప్రాధాన్యత కల్పించి, వారికి సాధికారత కల్పించడంలో విఫలమయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడ ఉంది మోడీ జీ? అంటూ మొదటి ప్రశ్న వేసారు కవిత. గమన దేశ జిడిపి పడిపోతున్నా, జిడిపి - గ్యాస్- డీజిల్- పెట్రోల్ ధరలు అమాంతంగా మాత్రం పెరుగుతున్నాయి. విచిత్రంగా అవి దేశ ప్రభుత్వ నియంత్రణలో ఎందుకు లేవు? అమితంగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టారని ప్రశ్నిచారామె. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వ పక్షపాతానికి ముగింపు ఎప్పుడని, తెలంగాణకు రావాల్సిన రూ.7000 కోట్ల పెండింగ్‌ నిధులను బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందని అడిగారు.

ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది, "మెహంగై ముక్త్ భారత్" అని ప్రకటించుకున్న మీరు అసలు అలాంటి "అచ్ఛే దిన్" ఎప్పుడు తెస్తారంటూ మరో ప్రశ్న వేశారు. విఫలమైన లా అండ్ ఆర్డర్, విఫలమైన వ్యవస్థలు, భారతదేశ ప్రజలకు కృత్రిమ ప్రచారాలు లేని నిజమైన "అమృత్ కాల్" ఎప్పుడు వస్తుందని అన్నారు కవిత. రైతులు భారతదేశానికి గుండె చప్పుడని, కానీ ఈ రోజు తెలంగాణలోని వరి, పసుపు రైతులు తమ కష్టానికి కనీస గుర్తింపును కోరినందుకు బిజెపి చేతిలో నష్టపోతున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వ "న్యూ ఇండియా" యొక్క వాస్తవికత ఏంటంటే, ఇక్కడ కోట్లాది మంది భారతీయులు తమకు కనీస ఆదాయం అందించే ఉపాధిని పొందడంలో కష్టపడుతున్నారని అన్నారు కవిత. చివరగా, "PMCares దేశ ప్రజలకు నిధుల గురించిన నిజమైన సమాచారం ప్రజలకు తెలియజేసే రోజు వస్తుందా? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత.

Next Story